ఏపీకి ప్రత్యేక హోదా అన్నది కొరకరాని కొయ్య అయిపోయింది. ఇది ఇప్పట్లో తేలే అంశం కాదు. అయితే కనీసం ప్యాకేజీ విషయంలో అయినా కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్యాకేజీ చట్టబద్ధతపై అసలు మాటే లేదు.. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు బీజేపీ మిత్రపక్షమైన తేదేపానే. అంతెందుకు ఏపీకి సాయంలో కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తోందంటూ తేదేపా నేతలే మండిపడుతున్నారు. బీజేపీతో కలిసి ఉండకపోతే అసలే అభివృద్ధి సాధ్యం కాదని భావించి చంద్రబాబు ఏమీ చేయలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ మాత్రం ఏపీకి పెద్ద హ్యాండ్ ఇచ్చారని తేదేపా వర్గాలు కోపంగా ఉన్నాయని చెబుతున్నారు.
మొన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత లభిస్తుందని చంద్రబాబు భావించారు. అలా జరగని పక్షంలో దీనిపై కనీసం చర్చ జరిగొచ్చని ఆశించారు. కానీ కేంద్ర కేబినెట్ భేటీలో టేబుల్ ఐటమ్ గా వచ్చిన ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ అసలు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈసారికి వదిలేయండి.. వచ్చే కేబినెట్ మీటింగులో చూసుకుందాం అని ప్రధాని విధిలించేశారు. ఈ నాటకాలు చూస్తుంటే ప్యాకేజీకైనా చట్టబద్ధత వస్తుందా? అన్నది అనుమానమేనని అంటున్నారు. ప్యాకేజీ చట్టబద్ధత ఇక చట్టుబండలేనా?