పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ వింత వ్యాధి కలకలం రేపింది. గత ఏడాది డిసెంబర్లో వింత వ్యాధితో ఏలూరులో వందలాంది మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా భీమడోలు మండలం పూళ్లలో రెండు రోజులుగా 10 మంది వింత వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారు. అయితే బాధితుల్లో మూర్ఛ లక్షణాలు ఉన్నాయని, ఉన్నట్టుండి కింద పడిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు తరహానే వింత వ్యాధి అయ్యి ఉండవచ్చని అక్కడి ప్రజలు మళ్ళీ ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్లో వింత వ్యాధి కారణంగా ఏలూరులో 622 మంది బాధితులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు. ఈ వ్యాధితో ఇద్దరు మరణించారు. దీనిని సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం వింత వ్యాధికీ గల కారణాన్ని తెలుసుకునేందుకు అత్యున్నత స్దాయి నిపుణులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 40 మందికి పైగా అధికారులు, నిపుణులు, డాక్టర్లతో కూడిన ఈ కమిటీ బాధితుల శాంపిల్స్ను పలు విధాలుగా పరీక్షించి విషతుల్యంగా మారిన కూరగాయలే వింత వ్యాధికి కారణమని తేల్చింది.