ఏపీలో పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో వైసీపీ నేతలు ఓటర్ స్లిప్పులతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని కూడా పంచడాన్ని నారా లోకేశ్ తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీలో వైసీపీ నేతలు పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూలను ఓట్ల స్లిప్పులతో కలిసి పంచుతూ స్వామివారికి మహాపచారం తలపెట్టారని, జగన్కి, వైసీపీ నేతలకు ఎన్నికలపైనే కానీ, ఏడుకొండలవాడిపై భక్తిలేదని అన్నారు.
సన్నాసుల సన్నబియ్యం వ్యాన్లలో లడ్డూలను తరలించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని, ఎస్సీలకు 5 లడ్లు, ఇతరులకు 10 లెక్క పంపిణీ చేసి కులవివక్ష చూపారని లోకేశ్ ఆరోపించారు. ఓట్లకు కోట్లు వెదజల్లుతున్నా పల్లెల్లో జగన్రెడ్డిని జనం నమ్మడంలేదని శ్రీవారి లడ్డూలిస్తే భక్తితోనైనా ఓటేస్తారని వైకాపా నేతలు పన్నిన కుతంత్రం ఇదని, హిందువులకు అత్యంత పవిత్రమైన లడ్డూలను ఓటర్లకు తాయిలాలుగా పంచిన అభ్యర్థిని పోటీకి అనర్హులుగా ప్రకటించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అంతేకాదు కొండపై భక్తులకు ఒక లడ్డూ దొరకని పరిస్థితిలో ఇన్ని వేల లడ్డూలు తరలించిన వైసీపీ నేతలు, వారికి అందించిన టిటిడి యంత్రాంగంపై చర్యలు చేపట్టాలని, స్వామికి జరిగిన అపచారం, వ్యాన్లలో తరలింపు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, కులవివక్షలపై కేసులు నమోదు చేసి నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీలో వైసీపీ నేతలు పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూలను ఓట్ల స్లిప్పులతో కలిసి పంచుతూ స్వామివారికి మహాపచారం తలపెట్టారు. @ysjaganకి,వైసీపీనేతలకు ఎన్నికలపైనే కానీ, ఏడుకొండలవాడిపై భక్తిలేదు.(1/5) pic.twitter.com/EHwlwXFy6u
— Lokesh Nara (@naralokesh) February 19, 2021