ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పీడ్ పెంచారు. ఈ తరుణంలో పలువురు అధికారులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే 9 మంది అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా పంచాయతీరాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజాశంకర్లపై కూడా వేటు వేశారు. 2021 ఓటర్ల జాబితాను పంపడంలో గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజాశంకర్ నిర్లక్ష్యం వహించారని అందుకే వీరిద్దరిని బదిలీ చేయాలని ఎస్6ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వీరి స్థానంలో మరో ముగ్గురు అధికారుల జాబితాను పంపాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఇదిలా ఉంటే ఇప్పటికే గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, నలుగురు సీఐలను వెంటనే బదిలీ చేయాలని మరోసారి సీఎస్ ఆదిత్యనాథ్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే గుంటూరు, చిత్తూరు కలెక్టర్ల నుంచి ఆయా జాయింట్ కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని, తిరుపతి అర్బన్ ఎస్పీ చిత్తూరు ఎస్పీకు చార్జ్ అప్పగించాలని ఇదివరకే సూచించినట్టు ఎస్ఈసీ తెలిపారు.