జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికలో తనలాంటి కొత్త వాళ్లే గెలిచి అసెంబ్లీకి వెళ్తే, ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి రెండు చోట్ల పోటీ చేస్తే కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారని సెటైర్లు విసిరారు. అసలు పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. ఆరు నెలలకు ఒకసారి కనిపించే పవన్ నాయుడు వల్ల రాష్ట్రానికి, ప్రజలకు జరిగేది ఏమీ లేదని అన్నారు.
అయితే వైసీపీ పాలన, సంక్షేమ పథకాల కారణంగానే తాటికొండలో ఎక్కువ స్థానాలను గెలిచామని, టీడీపీ కంచుకోటలను సైతం వైసీపీ బద్దలుకొట్టిందని ఉండవల్లు శ్రీదేవి అన్నారు. అయితే టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలిచారని ప్రచారం చేసుకుంటున్నారని, అది పూర్తిగా అవాస్తవం అని అన్నారు. అయితే భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ గెలవడం ఖాయమని శ్రీదేవి జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ నాయకత్వాన్ని ఆదరిస్తున్నారని, త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని శ్రీదేవి చెప్పుకొచ్చారు.